మహిళ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం, పిల్లల సంరక్షణ, ఇంటి బాధ్యతల్లో నిత్యం నిమగ్నమయ్యే మహిళలు చాలా సార్లు తమ ఆరోగ్యాన్ని పట్టించుకోవడం మరిచిపోతుంటారు. చిన్నపాటి ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేస్తూ.. తీవ్రమైన సమస్యగా మారిన తర్వాత ఆసుపత్రిని ఆశ్రయించే పరిస్థితులు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా క్యాన్సర్ వంటి వ్యాధులను ప్రారంభ దశలో గుర్తిస్తే సకాలంలో చికిత్స అందించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరోగ్య మహిళ కార్యక్రమం ఖమ్మం జిల్లాలో మహిళల ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నది.
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ పర్యవేక్షణలో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని సర్వజన aasupathrilo ప్రభుత్వ వైద్య విభాగం సమర్థవంతంగా అమలు చేస్తున్నది. జిల్లాలోని సర్వజన ఆసుపత్రిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రతి మంగళవారం, గురువారం నిపుణులైన మహిళా వైద్యులచే మహిళలకు ప్రత్యేకంగా ఉచితంగా ఆరోగ్య సేవలు అందిస్తున్నారు. ఓపీ నమోదు నుంచి స్క్రీనింగ్, పరీక్షలు, వ్యాధి నిర్ధారణ, అవసరమైన ఉన్నత వైద్య కేంద్రాలకు రిఫరల్, చికిత్స అనంతరం ఫాలో అప్ వరకు సేవలను అనుసంధానం చేస్తున్నారు.