Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలి

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో నోటీసులు అందుకున్న ఓటర్లు విచారణకు హాజరు కావాలి
Share Short Clip Download PDF

• అక్టోబర్ 18 వరకు కొనసాగనున్న విచారణ ప్రక్రియ.

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా మ్యాపింగ్ కానీ, అనామాలీస్ జాబితాలో ఉన్న వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లకు సంబంధించిన అభ్యంతరాలు, నోటీసులపై విచారణ నిర్వహించేందుకు ప్రత్యేక విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి తెలిపారు.
బుధవారం హనుమకొండ సుబేదారిలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల లోని పోలింగ్ కేంద్రంలో వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించిన ఏఈఆర్‌ఓ విచారణ కేంద్రాన్ని ఏర్పాటు చేయగా జిల్లా కలెక్టర్ సందర్శించారు.
వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో 50 విచారణ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఆర్ట్స్‌ కళాశాల లోనే ఐదు, ఆరు పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన విచారణలను నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో భాగంగా నో మ్యాపింగ్‌, అనామలీస్‌ కింద నోటీసులు అందుకున్న ఓటర్లను విచారణకు హాజరుకావాలని అన్నారు. నోటీసులు అందుకున్నవారు ఎన్నికల సంఘం సూచించిన విధంగా సంబంధిత ధ్రువపత్రాలతో విచారణ కేంద్రాలకు హాజరై ఏఈఆర్‌ఓలు, సూపర్‌వైజర్లు, బీఎల్‌ఓలకు పత్రాలను సమర్పించాల్సి ఉంటుందన్నారు.
విచారణకు హాజరైన నో మ్యాపింగ్, అనామలీస్ జాబితాలోని ప్రతి ఓటరు సమర్పించిన పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడంతో పాటు, హాజరు రిజిస్టర్‌లో సంతకం తీసుకోవాలని అధికారులకు సూచించారు.రోజువారీగా వచ్చిన దరఖాస్తులు, విచారణలను అదే రోజు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

విచారణ ప్రక్రియలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు, ఏఏఆర్‌ఓలు సమన్వయంతో పనిచేస్తూ షెడ్యూల్‌ ప్రకారం నోటీసులు సర్వ్‌ చేయడం, ఓటర్ల నుంచి అవసరమైన ధ్రువపత్రాలను స్వీకరించడం, వాటిని ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయడం వంటి ప్రక్రియలను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అన్నారు.
అర్హత ఉన్న ఏ ఒక్క ఓటరు కూడా తుది ఓటర్ల ముసాయిదా జాబితాలో చోటు కోల్పోకుండా అవసరమైన పత్రాలను సమర్పించేలా ప్రజలకు, ఓటర్లకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
ఈ ప్రక్రియలో రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా సహకరించాలని కోరారు. ఓటర్లకు అవసరమైన సమాచారం అందించడం, అర్హులైన వారు తమ ధ్రువపత్రాలతో విచారణకు హాజరయ్యేలా సహకరించడం ద్వారా తుది ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా రూపొందించేందుకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఈఆర్వో/ హనుమకొండ ఆర్డీవో వెంకటేష్, హనుమకొండ ఏఈఆర్ఓ/ తహసిల్దార్ రవీందర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.