కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ)లో కొనసాగుతున్న పలు అభివృద్ధి, నిర్మాణ పనులను గురువారం వైస్‌ఛాన్సలర్‌ ఆచార్య కే. ప్రతాప్‌ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించినట్లు విశ్వవిద్యాలయ అభివృద్ధి అధికారి ఆచార్య వై. వెంకయ్య తెలిపారు. వైస్‌ఛాన్సలర్‌ మహిళా వసతి గృహంలో నిర్మాణంలో ఉన్న డైనింగ్‌ హాల్, రూసా నిధులతో నిర్మిస్తున్న సెంట్రల్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ సెంటర్, రసాయన శాస్త్ర విభాగం నుంచి ఇంజనీరింగ్‌ కళాశాల (కో-ఎడ్యుకేషన్‌) వరకు ఉన్న రహదారి, ఇంజనీరింగ్‌ కళాశాలలో ఆధునికీకరిస్తున్న సెమినార్‌ హాల్, రూసా నిధులతో చేపడుతున్న కంప్యూటర్‌ సెంటర్, కే-హబ్‌లో కొనసాగుతున్న పనుల పురోగతిని పరిశీలించారు. అలాగే పరీక్షల విభాగంలో ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ కోసం చేపడుతున్న ఏర్పాట్లు, పబ్లికేషన్‌ సెల్‌లోని స్టోర్‌ నిర్మాణ పనులను కూడా పరిశీలించారు. ఆయా పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకుని, పలు సూచనలు, సలహాలు అందించారు.
ఈ సందర్భంగా వైస్‌ఛాన్సలర్‌ మాట్లాడుతూ నిర్మాణ పనుల్లో నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని, నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని సూచించారు. నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేసి, విద్యార్థులు, సిబ్బందికి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. వైస్‌ఛాన్సలర్‌ వెంట రిజిస్ట్రార్‌ ఆచార్య వి. రామచంద్రం, రూసా నోడల్‌ అధికారి ఆచార్య ఆర్. మల్లికార్జున రెడ్డి, రసాయన శాస్త్ర విభాగాధిపతి, పూర్వ అభివృద్ధి అధికారి ఆచార్య ఎన్. వాసుదేవ రెడ్డి, యూనివర్సిటీ ఇంజనీర్‌ శంకరయ్య తదితరులు ఉన్నారు.
ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య రాజేందర్‌ కట్ల, ఇంజనీరింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఆచార్య ఎన్. రమణ, వసతి గృహాల సంచాలకులు డాక్టర్‌ పి. శ్రీనివాస్, పబ్లికేషన్‌ సెల్‌ సంచాలకులు డాక్టర్‌ ఎం. నరసింహరావు, బిల్డింగ్‌ డివిజన్‌ సిబ్బంది పాల్గొన్నారు.