మార్కాపురం జిల్లాలోని వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించి.. జాతికి అంకితం చేశారు. ‘వెలిగొండ జలసిరులు-అభివృద్ధికి రెక్కలు’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రారంభోత్సవాన్ని నిర్వహించింది. కృష్ణాజలాలకు చంద్రబాబు నాయుడు జలహారతి ఇచ్చి.. ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వెలిగొండ ఫీడర్ కెనాల్ ఒడ్డున ఏర్పాటు చేసిన ప్రాజెక్టు మినియేచర్ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ప్రాజెక్టు ద్వారా ఏయే ప్రాంతాలకు నీరు చేరుతుంది... ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతుందనే వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం ప్రాజెక్టు పైలాన్ను ఆవిష్కరించి ప్రాజెక్టు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.