వర్ధన్నపేట మండలంలోని కట్ర్యాల గ్రామంలో గల డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ (నీటి నిల్వ కట్ట) చుట్టూ ఉన్న చెట్లను అమ్మిన డబ్బులు గ్రామపంచాయతీ ఖాతాలో జమ కాలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
కట్ర్యాలలో గోల్ మాల్.. డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ కట్టపై చెట్లు మాయం
ఏం జరిగింది..?
వర్ధన్నపేట మండలం కట్ర్యాల గ్రామ శివారులో డీ ఫ్లోరైడ్ నివారణ కోసం ఏర్పాటు చేసిన డీ ఫ్లోరైడ్ ప్రాజెక్ట్ కట్ట చుట్టూ పెద్ద ఎత్తున తుమ్మ, వేప, ఇతర చెట్లు ఉండేవి. ఇటీవల కోతుల బెడద, అసాంఘిక కార్యక్రమాల పేరుతో ఆ చెట్లను నరికి అమ్మేశారని గ్రామస్తులు చెబుతున్నారు.
లక్షల్లో చెట్ల విలువ - లెక్క లేదు:
నరికిన చెట్ల విలువ సుమారు రూ. 1.50 లక్షల నుండి 2 లక్షల వరకు ఉంటుందని అంచనా. నిబంధనల ప్రకారం ప్రభుత్వ స్థలంలోని చెట్లు అమ్మితే వచ్చిన డబ్బును గ్రామపంచాయతీ ఖాతాలో జమ చేయాలి. కానీ ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా పంచాయతీలో జమ కాలేదని పంచాయతీ రికార్డులు చెబుతున్నాయని సమాచారం.
ఎవరు అమ్మారు..?
ఈ చెట్లను ఎవరు అమ్మారు? డబ్బు ఎవరి జేబులోకి వెళ్ళింది..? అనే దానిపై గ్రామంలో చర్చ జరుగుతోంది. కాంట్రాక్టర్, గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ అధికారుల కుమ్మక్కుతోనే ఈ అవినీతి జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి, చెట్లు అమ్మిన డబ్బును పంచాయతీలో జమ చేయించడంతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు జిల్లా పంచాయతీ అధికారి ని కోరుతున్నారు.
వర్ధన్నపేట ఎంపీఓ వివరణ:
ఈ విషయంపై వర్ధన్నపేట ఎంపీఓ ను వివరణ అడుగగా కట్ర్యాల గ్రామ ఊరు చెరువులోని డిప్లోరైడ్ ప్రాజెక్ట్ గ్రామపంచాయతీ పరిధిలో లేదు. కాబట్టి మా శాఖకు సంబంధం లేదని తెలిపారు.