వ్యవసాయ కుటుంబంలో పుట్టి కష్టపడి జీవిస్తూ కుటుంబానికి, సమాజానికి మంచి విలువలను అందించిన తన తండ్రి శ్రీ పొన్నం సత్తయ్య గారి ఆశయాలు, మానవతా విలువలను ముందుకు తీసుకెళ్లడమే తమ కుటుంబ బాధ్యత అని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. పొన్నం సత్తయ్య గౌడ్ 16వ వర్ధంతి సందర్భంగా పొన్నం సత్తయ్య చారిటబుల్ ట్రస్ట్, కరీంనగర్ మరియు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఆదివారం రవీంద్ర భారతిలో “పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలు - 2026” కార్యక్రమాన్ని రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో విశిష్ట సేవలందించిన ఎం. కోదండరెడ్డి, సాహిత్య రంగంలో సేవలందించిన వెలిచాల కొండల్ రావు, జానపద కళారంగంలో విశేష ప్రతిభ కనబరిచిన గొట్టే కనకవ్వలకు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు. శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు జూపల్లి కృష్ణారావు, వివేక్ వెంకట్ స్వామి, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పొన్నం ప్రభాకర్ తదితరులు పురస్కారాలను అందజేశారు. పురస్కార గ్రహీతలకు మెమెంటోతో పాటు రూ.50 వేల నగదు పురస్కారాన్ని అందించారు.