కాకతీయ విశ్వవిద్యాలయం(కేయూ) జంతుశాస్త్ర విభాగానికి చెందిన ఆచార్య జి. షమితా, విభాగ పరిశోధకురాలు, విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థిని మౌనికా జే., హైదరాబాద్ సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాల మైక్రోబయాలజీ విభాగ సహాయ ఆచార్యురాలు గాయత్రీ సంయుక్తంగా చేపట్టిన వినూత్న పరిశోధనకు భారత ప్రభుత్వ పేటెంట్ మంజూరైంది. “Synthesis of Antimicrobial Silver Nanoparticles from Gut Bacteria of Tassar Silkworm” అనే ఆవిష్కరణకు పేటెంట్ నంబర్ 596905 లభించింది. ఈ పేటెంట్‌కు 25.08.2025 న దరఖాస్తు చేయగా, 27.07.2026న మంజూరైనట్లు ఆచార్య జి. షమితా తెలిపారు. ఈ ఆవిష్కరణ ద్వారా టస్సర్ సిల్క్ వార్మ్ కు సంభవించే వ్యాధులను నియంత్రించడంతో పాటు, పట్టు ఉత్పత్తిని పెంచే అవకాశం ఉందని తెలిపారు. తద్వారా సుస్థిరమైన సెరికల్చర్ అభివృద్ధికి ఈ పరిశోధన దోహదపడుతుందని పేర్కొన్నారు. శాస్త్రీయ పరిశోధనలను సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలుగా మలచడంలో ఈ పేటెంట్ ఒక ముఖ్యమైన ముందడుగని ఆచార్య షమితా తెలిపారు. ఈ సందర్భంగా కాకతీయ విశ్వవిద్యాలయ వైస్‌చాన్స్‌లర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం, సైన్స్ విభాగాల డీన్, ఓఎస్డీ ఆచార్య బి. వెంకట్రామరెడ్డి పేటెంట్ పొందిన పరిశోధకులను అభినందించారు. విభాగ అధిపతి ఆచార్య వై. వెంకయ్య, ఆచార్య మామిడాల ఇస్తారి, ఆచార్య ఈసం నారాయణ తో పాటు పలువురు బోధనా, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు కూడా అభినందనలు తెలిపారు.