ఒక మహిళను గొడ్డలితో తలపై కొట్టి హత్య చేసిన కేసులో భార్యభర్తలు పాడ్డే గంగాధర్, పాడ్డే గోదావరి లకు రెండు జీవిత కారాగార శిక్షలు విదిస్తూ నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ శుక్రవారం తీర్పు వెలువరించారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.
మహిళ హత్య కేసులో భార్యభర్తలకు రెండు జీవిత కారాగార శిక్షలు...
• తీర్పు వెలువరించిన నిజామాబాద్ సెషన్స్ జడ్జి జీవిఎన్ భారత లక్ష్మీ...
• తీర్పు వివరాలు వెల్లడించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి
పబ్లిక్ ప్రాసిక్యూటర్ ధర్పల్లి రాజేశ్వర్ రెడ్డి తెలిపిన వివరాలు
నిజాబాద్ జిల్లా రెంజల్ మండలం బోర్గం గ్రామ నివాసులైన గంగాధర్, గోదావరి, పెంటెవార్ చంద్రకళ లు కలిసి ఉపాధిహామీ పథకం పనులకు వెళ్ళేవారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఒక కుటుంబ సంబంధాలు ఏర్పడినవి. చంద్రకళ గంగాధర్, గోదావరి లను కొడుకా.. కోడల అని పిలిచేది. వారి ఆర్థిక అవసరానికి చంద్రకళ ఆదుకుని డబ్బులు అప్పుగా ఇచ్చేది. గోదావరి కి ఆరోగ్యం బాగాలేక గంగాధర్ అనేక ఆసుపత్రులలో డాక్టర్లకు చూపించి మందులు వాడిన ఆమె ఆరోగ్యం కుదుట పడలేదు. భార్యభర్తలిద్దరికి మంత్రతంత్రాలు, చేతబడిలపై నమ్మకం బలంగా ఉండటంతో ఎలారెడ్డి మండలం కుమ్మరి గల్లికి చెందిన మంత్రగాడు సయ్యద్ హుస్సేన్ ను సంప్రదించడంతో అతను ఏవేవో మంత్రాలు చేశాడు. ఎంతకు గోదావరి ఆరోగ్యం మంచిగా కాకపోవడంతో భార్యభర్తలిద్దరు మరల సయ్యద్ హుస్సేన్ ను ఆశ్రయించారు. మీకు దగ్గరివారే మీకు మంత్రాలు చేసి గోదావరి ఆరోగ్యం బాగా లేకుండా చేస్తున్నారని, ఆ దగ్గరగా ఉన్న వారిని చంపివేస్తే ఆరోగ్యం బాగుపడుతుందని హుస్సేన్ తెలపడంతో వారిద్దరి అనుమానం చంద్రకళ వైపు మళ్ళింది. మా ఇంటికి వస్తు మా ఆరోగ్యం బాగుండక పోవడానికి చంద్రకళనే కారణమనుకుని అనుమానం పెంచుకోని, తమ అవసరానికి డబ్బులు ఇచ్చిన ఆమెను అంతం చేస్తే డబ్బులు కూడా ఇవ్వనవసరం లేదని ఒక కుట్ర తయారు చేసుకున్నారు. వారి కుట్రలో భాగంగా చంద్రకళ ను 2024 ఏప్రిల్ 10 న ఇంటికి రావలసిందిగా ఫోన్ లో కోరారు. బిడ్డా.. నువ్వే ఇంటికి వచ్చి తీసుకుపోరాదు అని ఆమె తెలపడంతో గంగాధర్ తన బైక్ పై వెళ్లి ఆమెను ఇంటికి తీసుకువచ్చాడు. గంగాధర్,గోదావరి,చంద్రకళ ముగ్గురు కలిసి వారింటిలో కల్లు తాగారు..అమ్మ నీకు డబ్బులు ఇచ్చేది ఉన్న కదా మొత్తం 57 వేలు అని సాటాపూర్ గ్రామంలోని బ్యాంక్ కు పోయి తీసుకవస్తానని నమ్మించి సాయంత్రం వచ్చిన గంగాధర్ కొంతసేపటికి ఇంటి హల్ లో కూర్చున్న చంద్రకళ తలపై గొడ్డలితో బలంగా మూడునాల్గుసార్లు కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. ఆమె మీదున్న బంగారు, వెండి ఆభరణాలు తీసుకుని దాచుకున్నారు. ఆమె మృత దేహాన్ని ఒక సంచిలో ఉంచి దాన్ని బర్రెల కొట్టంలో దాచారు. రక్తాన్ని నీళ్లతో కడిగివేసి రాత్రి సమయంలో ఆ సంచికి నల్లని మరొక సంచిని చుట్టి ఎవరికి హత్య విషయం తెలియవద్దని బావించిన భార్యభర్తలు బైక్ ను గంగాధర్ నడుపగ బైక్ మధ్యలో శవం ఉన్న సంచి పెట్టి వెనుక గోదావరిని కూర్చుండబెట్టుకోని అర్ధరాత్రి సమయంలో నవీపేట్ మండల పరిధిలోని భరత్ నగర్ తాండా వద్దగల అలిసాగర్ లిప్ట్ కేనాల్ నీళ్లలో మృతదేహాన్ని వేశారు. తిరిగి ఇంటికి వచ్చిన వారు శవానికి ఊయోగించిన కొన్ని వస్తువులను, చంద్రకళకు అప్పు తీసుకున్నపుడు రాసిచ్చిన ప్రామీసరి నోట్ ను, ఆమె చెప్పులను, ఫోన్ ఇంటికి దగ్గరగా ఎండు గడ్డిలో కాల్చివేశారు. హత్యకు ఊయోగించిన గొడ్డలిని పొలంలో ఒక దగ్గర భూమిలో దాచిపెట్టారు.
సదరు హత్య నేర అభియోగాలు కోర్టు నేర న్యాయ విచారణలో రుజువు అయినట్లు సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తన తీర్పులో పేర్కొన్నారు. భారత శిక్షస్కృతి సెక్షన్ 302 హత్య నేరంకుగాను జీవిత కారాగార శిక్ష,సెక్షన్ 120(బి ) హత్య చేయడానికి నేరపూరిత కుట్ర చేసినందున జీవిత కారాగార శిక్ష,సాక్ష్యాలను తారుమారు చేసినందుకుగాను ఏడు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష,సెక్షన్ 404 మృతి చెందిన వారిపైన ఉన్న ఆస్థిని నిజాయితీ లేకుండా మోసపూరితంగా తీసుకోవడం నేరంకు గాను మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష లు విదిస్తూ జడ్జి తీర్పును ప్రకటించారు. శిక్షలన్ని ఏకకాలంలో అనుభవించాలని సెషన్స్ జడ్జి భారత లక్ష్మీ తమ తీర్పులో పేర్కొన్నారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేశ్వర్ రెడ్డి తెలిపారు.