ప్రస్తుత యాంత్రిక పరిస్థితుల్లో మళ్లీ గాంధీ ఇజం అవసరం ఎంతైనా ఉందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే. అనిల్ కుమార్ అన్నారు. బుధవారం నాడు జిల్లా కలెక్టరేట్లో,గాంధీ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్-2 నుండి అక్టోబర్ -2 వరకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల్లో గాంధీజీ సిద్ధాంతాలు, ఆలోచనలను వాళ్ల మనసులోకి ఎక్కేలా ప్రచారం చేసే గాంధీజీ మాసోత్సవాల కార్యక్రమాల పోస్టర్, కరపత్రాలను ఆవిష్కరించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
గాంధీ చూపిన అహింసా మార్గం ప్రపంచ దేశాలకే మార్గదర్శనం
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కే. అనిల్ కుమార్.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ
నాటి భారత దేశ స్వాతంత్ర సంగ్రామం, మొదలు నిన్న మొన్నటి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వరకు ప్రజలు అహింసాయుత శాంతి మార్గాల్లోనే విజయం సాధించారనేది నిత్య సత్యమని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న అనేక ప్రజా పోరాటాలు శాంతి ఉద్యమాలకు మహాత్ముడే ఆదర్శం అని పేర్కొన్నారు.ప్రముఖ సైకాలజిస్ట్ గాంధీజీ రీసర్చ్ ఫౌండేషన్ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ మాట్లాడుతూ నేటి ఆధునిక యాంత్రిక జీవనంలో నిత్యం హింస ప్రవృత్తి, హత్యలు, ఆత్మహత్యలు, మానభంగాలు అనేకం చోటుచేసుకుంటున్నాయని అన్నారు.
ఉన్నత సాంస్కృతిక ఆధ్యాత్మిక చరిత్ర కలిగిన భారతదేశం ఆత్మహత్యలు, నిరక్షరాస్యత, అవినీతిలో ముందంజలో ఉండటం బాధాకరమని, ఇటువంటి పరిస్థితులకు పరిష్కార మార్గాలుగా మనం మళ్లీ మూలాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ క్రమంలో భారతదేశం ఒక సంపూర్ణమైన ఎదుగుదలతో కూడిన, వికాసంతో పరిణితి చెందిన మనస్తత్వం గల యువతి యువకులుగా ఎదగడానికి, కౌమార దశలో సరైన మార్గ నిర్దేశం చేస్తూ విద్యార్థులను జాగృతం చేయాల్సిన సామాజిక బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఆ క్రమంలోనే గత 20 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం గాంధీజీ మాసోత్సవాలు నిర్వహిస్తూ విద్యార్థులను ఒక మంచి ఆలోచనల దిశగా పయనించే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ముందుగా గాంధీజీ ఆలోచనలు సిద్ధాంతాలను ప్రచారం చేసే కార్యక్రమాలను నిర్వహించి, ప్రతి జిల్లాలో ప్రపంచ శాంతి గాంధీ మార్గం అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించి, విజేతలకు అక్టోబర్ రెండవ తారీకు నాడు గాంధీ జయంతి రోజున బహుమతులు ప్రశంస పత్రాలు ఆయా జిల్లా కలెక్టర్ల చేతుల మీదుగా అందజేయనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ మరియు సమాజంలోని మేధావులు, సామాజికవేత్తలు సహకరించి దిగ్విజయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి రాజేంద్రప్రసాద్, జిల్లా సైన్స్ అధికారి అప్పారావు, జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షులు చిత్తనూరీ శ్రీనివాస్, మధు తదితరులు పాల్గొన్నారు.