Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జాతీయం

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి

పిల్లల్లోని సృజనాత్మకతను వెలికితీయాలి.. యువతను దేశ భవిష్యత్తుతో అనుసంధానించాలి

వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
Share Short Clip Download PDF

నెల రోజుల పాటు దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప ఉత్సవాలు’ : ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్

వికసిత్ భారత్ నిర్మాణంలో సమాజంలోని ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ సుదీర్ఘకాలంగా ప్రజాసేవలో కొనసాగుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నెల రోజుల పాటు ‘సేవా సంకల్ప ఉత్సవాలు’ నిర్వహించనున్నట్లు తెలిపారు. విజయవాడ రామారావు కన్వెన్షన్ సెంటర్‌లో మంగళవారం నిర్వహించిన రాష్ట్ర కార్యశాలను ఆయన ప్రారంభించారు.

ప్రధాని మోదీ దేశం కోసం పూర్తి స్థాయి అంకితభావంతో పనిచేస్తున్న నాయకుడని మాధవ్ పేర్కొన్నారు. సమస్యలు, సవాళ్లను ముందుగానే గుర్తించి పరిష్కారాలు చూపుతూ దేశాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు. భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోదీకి విశేష గుర్తింపు లభించిందన్నారు. త్రివర్ణ పతాకానికి అంతర్జాతీయంగా గౌరవం పెరగడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని చెప్పారు.

కోవిడ్ సమయంలో ప్రపంచ దేశాలు భారత్ తీవ్రంగా దెబ్బతింటుందని భావించాయని, అయితే దేశీయంగా వ్యాక్సిన్లను అభివృద్ధి చేసి ప్రజలకు అందించడంతో పాటు ఇతర దేశాలకు కూడా సరఫరా చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనన్నారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఇబ్బంది లేకుండా ముందుచూపుతో క్రూడ్‌ ఆయిల్ నిల్వలను ఆరు నెలలకు సరిపడా సిద్ధం చేసినట్లు తెలిపారు.

గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ సాధించిన అభివృద్ధి నమూనాను దేశవ్యాప్తంగా అమలు చేయాలన్న ప్రజల ఆకాంక్ష మేరకు ఆయన ప్రధానిగా ఎదిగారని మాధవ్ అన్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమాజంలోని చిట్టచివరి వ్యక్తికి ప్రభుత్వ పథకాల ప్రయోజనం చేరాలనే లక్ష్యంతో అనేక కార్యక్రమాలు చేపట్టారని వివరించారు.

పిల్లల ఆలోచనలకు పదును పెట్టాలి

సేవా సంకల్ప ఉత్సవాల దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. భవిష్యత్ తరాల ఆలోచనలు, సృజనాత్మకతను వెలికితీసి దేశ నిర్మాణంతో అనుసంధానం చేయాలని సూచించారు. 15 ఏళ్ల వయసు నుంచే పిల్లల్లో వికసిత్ భారత్‌పై అవగాహన కల్పించాలన్నారు.

పాఠశాలలకు వెళ్లే కార్యకర్తలు ఉపాధ్యాయులతో సమన్వయం చేసుకుని విద్యార్థులతో వినయంగా మమేకం కావాలని సూచించారు. గతంలో దేశం ఎలా ఉంది? ప్రస్తుతం ఎలాంటి మార్పులు వచ్చాయి? ఆ మార్పులకు కారణాలేమిటి? భవిష్యత్ భారత్ ఎలా ఉండాలి? అనే అంశాలపై విద్యార్థులతో చర్చలు నిర్వహించాలని చెప్పారు.

డ్రాయింగ్, వ్యాసరచన, ప్రసంగం, నాయకత్వ నైపుణ్యాల వంటి పోటీలు నిర్వహించి పిల్లల్లో దేశభక్తి, సృజనాత్మకతను
పెంపొందించాలన్నారు. విద్యార్థులు భవిష్యత్ భారతదేశాన్ని ఎలా చూడాలనుకుంటున్నారో వారి అభిప్రాయాలను సేకరించి వీడియోల రూపంలో ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

మోదీ ఒక్కరి కల కాదు

వికసిత్ భారత్ నిర్మాణం ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరి బాధ్యత కాదని, దేశంలోని ప్రతి పౌరుడి సమిష్టి బాధ్యత అని ప్రజలకు వివరించాలని సత్యకుమార్ అన్నారు. ఆర్థిక, సైనిక, సాంకేతిక తదితర అన్ని రంగాల్లో భారత్ ప్రపంచంలో అగ్రగామిగా నిలిచి విశ్వగురువుగా ఎదగాలన్న లక్ష్యాన్ని యువతకు వివరించాలని సూచించారు.

సేవా కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువ కావాలని, పార్టీ గుర్తింపుకు మించి సమాజానికి సేవ చేసే వ్యక్తులుగా కార్యకర్తలు ప్రజల విశ్వాసాన్ని పొందాలని పిలుపునిచ్చారు. చిన్న వయసు నుంచే పిల్లల్లో దేశభక్తి, దేశం పట్ల బాధ్యత, సమాజ సేవ భావనలను పెంపొందిస్తే వారు భవిష్యత్తులో దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తారని తెలిపారు.

పార్టీ కార్యక్రమాలపై దిశానిర్దేశం

రాష్ట్ర కార్యశాలను రాష్ట్ర ఇన్‌ఛార్జి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి పర్యవేక్షించారు. అతిథులను పార్టీ ఉపాధ్యక్షురాలు నిర్మలా కిషోర్ వేదికపైకి ఆహ్వానించారు. రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్‌జీ సమారోప్ నిర్వహించారు.

కార్యశాలకు ముందు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి, నాగోతు రమేష్ నాయుడు, మట్టా ప్రసాద్, సాలిగ్రామ లక్ష్మీ ప్రసన్నలతో పీవీఎన్ మాధవ్ సమావేశమయ్యారు. పార్టీ కార్యక్రమాల రూపకల్పన, సేవా సంకల్ప ఉత్సవాల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి వై. సత్యకుమార్ యాదవ్ పలు సూచనలు చేశారు.