Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

సాఫిగా గ్రామాలకు తాగునీటి సరఫరా

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

సాఫిగా గ్రామాలకు తాగునీటి సరఫరా
Share Short Clip Download PDF

శాయంపేట మండలం జోగంపల్లిలోని మిషన్ భగీరథ నీటి శుద్దీకరణ ప్లాంటును పరిశీలించిన కలెక్టర్.

శాయంపేట మండలంలోని గ్రామాలకు తాగునీటి సరఫరాలో ఎక్కడ కూడా సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అధికారులను ఆదేశించారు.

శనివారం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లిలోని మిషన్ భగీరథ తాగునీటి శుద్దీకరణ ప్లాంట్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా రా వాటర్ ఎక్కడినుండి వస్తుందని, నీటి సరఫరా పరిస్థితి ఎలా ఉందని, పంపుల పనితీరు, క్లోరినేషన్, ఇన్‌ట్రా డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థ, పంపింగ్ తీరు తదితర అంశాలను సంబంధిత అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
శాయంపేట మండలంలోని 26 గ్రామాలకు రోజుకు ప్రస్తుతం సుమారు 5.35 ఎమ్ఎల్డీ నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు కలెక్టర్‌కు వివరించారు.

నీటి సరఫరా కోసం ఏర్పాటు చేసిన అన్ని పంపులు పని చేసే స్థితిలో ఉన్నాయా, ఏదైనా సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు వెంటనే వినియోగించేందుకు స్టాండ్‌బై పంపులు, ప్రత్యామ్నాయ పరికరాలు అందుబాటులో ఉన్నాయా అని కలెక్టర్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ

ప్రజలకు సురక్షితమైన తాగునీరు నిరంతరాయంగా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

నీటి సరఫరా వ్యవస్థలో ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే గుర్తించి పరిష్కరించాలని, ప్రత్యామ్నాయ నీటి వనరులు, అదనంగా పరికరాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచాలని సూచించారు.ప్రజలకు తాగునీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని పేర్కొన్నారు.

అదేవిధంగా పరకాల లోని చలి వాగు కు సంబంధించిన చెక్ డ్యామ్ ను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. చెక్ డ్యామ్ ద్వారా వరద నీరు సాఫీగా వెళ్లే విధంగా చేపట్టనున్న మరమ్మతు పనుల గురించిన వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మిషన్ భగీరథ ఇంట్రా ఆర్డబ్ల్యూఎస్ ఈఈ గాయత్రి, వాటర్ గ్రిడ్ ఈఈ సురేందర్, సాగునీటిపారుదల శాఖ ఈఈ సునీత, ఇతర అధికారులు పాల్గొన్నారు.