శుక్రవారం జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణలో మట్టి గణపతి ప్రతిమలను జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె. అనిల్ కుమార్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బందికి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ...వినాయక చవితి పండుగను పర్యావరణహితంగా, రసాయన రహితంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (PoP), ప్రమాదకర రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాల వల్ల జల వనరులు కలుషితమై పర్యావరణానికి తీవ్ర విఘాతం కలుగుతోందని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా మట్టి విగ్రహాలనే పూజించి నీటి మూలాలను, పర్యావరణాన్ని కాపాడుకోవాలని కోరారు. ప్లాస్టిక్, రసాయన విగ్రహాల వాడకాన్ని పూర్తిగా నివారించి, పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి సాయి శ్రీజ, డి.పి.ఆర్.ఓ రాజేంద్రప్రసాద్, వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.