Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి.

పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి
Share Short Clip Download PDF

ప్రభుత్వ పింగిళి డిగ్రీ కళాశాలలో ఈ నెల 13న జరగనున్న కంబైన్డ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ కేంద్రంను పరిశీలించిన కలెక్టర్.

ఈ నెల 13వ తేదీన( ఆదివారం) జరగనున్న నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్ 2, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీస్ -2 పరీక్ష నిర్వహణకు పరీక్షా కేంద్రాలలో పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు. బుధవారం హనుమకొండ వడ్డేపల్లి లోని పింగిళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ పరిశీలించారు.
కళాశాలకు చేరుకున్న కలెక్టర్‌కు కళాశాల సిబ్బంది ఘన స్వాగతం పలకగా, ఎన్‌సీసీ కేడేట్లు గౌరవ వందనం సమర్పించారు. ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో ఎంతమంది అభ్యర్థులకు పరీక్షకు కేటాయించారనే వివరాలను కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ బి. చంద్రమౌళి ని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పరీక్ష కోసం కేటాయించిన తరగతి గదులను పరిశీలించారు. కళాశాలలోని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ గదిని సందర్శించి పరీక్షకు సంబంధించి వచ్చిన మెటీరియల్ వివరాలను ఎగ్జామినేషన్ ఇన్చార్జి సుహాసిని కలెక్టర్ కు వివరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...

పరీక్ష నిర్వహణలో నిబంధనలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు. పరీక్షా గదుల నిర్వహణ, తాగునీరు, విద్యుత్, భద్రత తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సూచించారు.
అదేవిధంగా కలెక్టరేట్ లోని పరీక్షలకు సంబంధించిన మెటీరియల్ ను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమును కలెక్టర్ పరిశీలించారు. వాటికి సంబంధించిన వివరాలను జిల్లా ఖజానా అధికారి శ్రీనివాస్ కుమార్, కలెక్టరేట్ పరిపాలన అధికారి గౌరీ శంకర్ కలెక్టర్ కు వివరించారు.
హనుమకొండ సుబేదారిలోని యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఎన్డీఏ, నావల్ అకాడమీ పరీక్ష ఈనెల 13న ఉదయం 10:00 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4:30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని, అదేవిధంగా వడ్డేపల్లి లోని పింగళి ప్రభుత్వ బాలికల డిగ్రీ, పీజీ కళాశాలలో సిడిఎస్ పరీక్ష ఉదయం 9 నుండి 11 గంటల వరకు, మధ్యాహ్నం 12:30 నుండి 2:30 గంటల వరకు, సాయంత్రం 4 నుండి 6 గంటల వరకు పరీక్ష జరుగుతుందని అధికారులు తెలిపారు.

తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్

పింగిళి ప్రభుత్వ డిగ్రీ పీజీ కళాశాలను సందర్శించిన కలెక్టర్ కళాశాలలోని తరగతులైన పరిశీలించారు. బీసీఏ ప్రథమ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులతో కలెక్టర్ మాట్లాడారు. చదువులు పూర్తయిన వెంటనే పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలని, సాఫ్ట్వేర్ రంగంలోనూ ఉద్యోగాలు సాధించాలని విద్యార్థినులకు సూచించారు. కళాశాలలో విద్యార్థినుల సంఖ్య, బోధన, బోధనేతర సిబ్బంది వివరాలను, మౌలిక వసతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

పరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలి