దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే దిశగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థిక, ఇంధన, ప్రణాళిక శాఖల మంత్రి భట్టి విక్రమార్క మల్లు అన్నారు.
మధిర నియోజకవర్గంలోని చింతకాని, బోనకల్ మండలాల్లో ప్రజలకు అవసరమైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీలు, విద్య, వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు అభివృద్ధి పనులకు ఆదివారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
చింతకాని మండలంలోని కొదుమూరు ఎస్సీ కాలనీలో రూ.66 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, లచ్చగూడెంలో రూ.29 కోట్లతో నూతన ప్రభుత్వ నర్సింగ్ కళాశాల నిర్మాణానికి, రూ.1.75 కోట్లతో లచ్చగూడెం –నేరడ పీఆర్ రహదారి వరకు చింతకాని– వందనం ఆర్అండ్బీ రహదారి నుంచి బీటీ రోడ్డు నిర్మాణానికి, రూ.7 కోట్లతో లచ్చగూడెం– అనంతారం బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
చింతకాని గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.44 లక్షలతో, నాగిలిగొండ ఎస్సీ కాలనీలో రూ.85 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, నాగిలిగొండ నుంచి తూటికుంట్ల వరకు రూ.5.25 కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
బోనకల్ మండలంలోని నారాయణపురం ఎస్సీ కాలనీలో రూ.63 లక్షలతో అంతర్గత సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి, రూ.1 కోటితో ఎస్సీ కాలనీలో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి, రాయన్నపేట ఎస్సీ కాలనీలో రూ.19 లక్షలతో అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.
నారాయణపురంలో రూ.80.84 లక్షలతో నిర్మించిన 1,000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పీఏసీఎస్ గోదాంను, మోటమర్రిలో రూ.24.50 లక్షలతో నిర్మించిన 300 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన పీఏసీఎస్ గోదాంను డిప్యూటీ సీఎం ప్రారంభించారు.
అదేవిధంగా కలకోట - రాపల్లి–గన్నవరం– ముసలిమడుగు–లక్ష్మీపురం రహదారిని రూ.57 కోట్లతో కిలోమీటర్ 0/0 నుంచి 20/0 వరకు వెడల్పు చేసి పటిష్టం చేసే పనులకు, బ్రాహ్మణపల్లి–గన్నవరం మీదుగా రాపల్లి వరకు ఉన్న పీడబ్ల్యూడీ రహదారిని రూ.26 కోట్లతో కిలోమీటర్ 0/0 నుంచి 8/0 వరకు వెడల్పు చేసి పటిష్టం చేసే పనులకు శంకుస్థాపనలు చేశారు. రాపల్లిలో రూ.20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనులకు కూడా డిప్యూటీ సీఎం శంకుస్థాపన చేశారు.