గుంటూరు జిల్లా మంగళగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ అత్యధునిక ఏఐ సాంకేతికత అందుబాటులోకి వచ్చింది. ఒకే ఒక్క నిమిషంలో హెల్త్ రిపోర్ట్స్ ఇచ్చే ఈ టెక్నాలజీ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆధునిక టెక్నాలజీతో వైద్యం అందించే లక్ష్యంతో కూటమి సర్కార్‌ అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగా ఏఐ సేవలను వినియోగంలోకి తీసుకొస్తోంది. రక్త నమూనాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే వైద్య పరీక్షలు నిర్వహించే విధానం అందుబాటులోకి తెచ్చింది. గుజరాత్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల తర్వాత.. ఈ వినూత్న విధానాన్ని అమలు చేస్తున్న మూడో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. మంగళగిరిలోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యాధునిక ఏరోస్ వెల్‌నెస్ ఏఐ క్లినిక్ ను అధికారులు ప్రారంభించారు. అసలు ఈ ఏఐ ఫేస్ స్కానింగ్ ఎలా పనిచేస్తుందంటే.. కెమెరా ముందు కొన్ని క్షణాలు ఉండగానే.. నాడి సంకేతాలతోపాటు ముఖంలో కనిపించే అతి సూక్ష్మమైన మార్పులను ఏఐ విశ్లేషిస్తుంది. రక్తం బొట్టు బయటకు తీయకుండానే ప్రాథమికంగా 28 రకాల పరీక్షల ఫలితాలను గుర్తిస్తుంది. ఆ తర్వాత ఐఓటీ సాంకేతికతతో అనుసంధానించి ఇంకో 32 రకాల వైద్య పరీక్షలు చేసి డిజిటల్ రూపంలో కళ్ల ముందు ఉంచుతుంది. ఈ ప్రక్రియకు పట్టే సమయం కేవలం 60 సెకన్లు. అంటే 60 సెకన్ల వ్యవధిలోనే 60 రకాల రిపోర్టులు డిజిటల్ రూపంలో సిద్ధమవుతాయి. ఈ సరికొత్త ఏఐ క్లినిక్ ద్వారా బీపీ, మధుమేహం, గుండె జబ్బులతో పాటు పలు దీర్ఘకాలిక వ్యాధులను ప్రాథమిక దశలోనే సులభంగా పసిగట్టవచ్చు. దీని ద్వారా ప్రాణాపాయం రాకుండా ముందుగానే అలర్ట్‌ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మంగళగిరిలో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ట్రయల్ రన్ చేపట్టారు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతమైతే.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌ను మరింత విస్తరించే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.