జూబ్లీహిల్స్‌లోని భద్రాచలం కేఫ్‌లో ఆహార భద్రత, పరిశుభ్రత నిబంధనల ఉల్లంఘనలు వెలుగుచూశాయి. ఆన్‌లైన్‌లో వచ్చిన ఫిర్యాదు మేరకు H-FAST బృందం, జీహెచ్‌ఎంసీ ఫుడ్‌ సేఫ్టీ అధికారి కె. మౌలిక సమన్వయంతో తనిఖీలు నిర్వహించింది. తనిఖీల్లో కేఫ్‌లో FSSAI లైసెన్స్‌ను ప్రదర్శించకపోవడం, తగినంత వెలుతురు లేకపోవడం, చెత్తబుట్టలకు మూతలు లేకపోవడం గుర్తించారు. ఈగల నివారణకు ఫ్లై ట్రాప్స్ ఏర్పాటు చేయకపోవడంతో పాటు వాషింగ్‌ ఏరియాకు సరైన విభజన లేకపోవడాన్ని అధికారులు గుర్తించారు.
ఆహారం తయారు చేసే సిబ్బందికి వైద్య పరీక్షల రికార్డులు, పెస్ట్‌ కంట్రోల్‌, స్టాక్‌ రిజిస్టర్లు అందుబాటులో లేవని తేలింది. ఆహార పదార్థాలను సక్రమంగా మూతపెట్టకపోవడం, లేబులింగ్‌ చేయకపోవడం, వంటగదిలో పరిశుభ్రత లోపించడంపై అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలను నమోదు చేసిన అధికారులు.. కేఫ్‌ బాధ్యుడిని తదుపరి చర్యల నిమిత్తం ఫుడ్‌ సేఫ్టీ అధికారికి అప్పగించారు. వర్తించే ఆహార భద్రత చట్టాల ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు.