Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట..

రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.

విద్య, వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట..
Share Short Clip Download PDF

*సత్తుపల్లి మునిసిపల్ పరిధిలో రూ.1.83 కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం.

*రూ.40 లక్షలతో కమ్యూనిటీ హాల్‌కి శంకుస్థాపన, రూ.1.43 కోట్లతో అర్బన్ హెల్త్ సెంటర్ ప్రారంభించిన మంత్రి
--------------------------
ప్రజారోగ్యం, విద్యారంగాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత ప్రాధాన్యమిస్తోందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గురువారం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలో రూ. 1.83 కోట్ల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ..

పట్టణ పేదలకు నాణ్యమైన ఉచిత ప్రాథమిక వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా ఎన్టీఆర్ నగర్‌లో రూ. 1.43 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ భవనాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. హెల్త్ సెంటర్ కావాల్సిన వైద్యాధికారులు, సిబ్బంది నియామకానికి చర్యలు చేపడతామన్నారు.
అలాగే శివసాయి నగర్‌లో రూ. 40 లక్షల నిధులతో నిర్మించనున్న మల్టీపర్పస్ మున్సిపల్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు భూమిపూజ చేసి శంకుస్థాపన చేశారు. స్థానిక ప్రజల సామాజిక కార్యకలాపాలకు, శుభకార్యాలకు ఈ భవనం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. విద్య, వైద్యం, మౌళిక వసతుల కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. రామారావు, విద్యుత్ శాఖ ఎస్ఇ శ్రీనివాస చారి, హౌజింగ్ పిడి భూక్యా శ్రీనివాస్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ అధికారులు, పాల్గొన్నారు.