ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా జారీ చేసిన నోటీసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎన్నికల నమోదు అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం వెంకటాపూర్ మండలం లక్ష్మీదేవిపేట గ్రామంలోని పోలింగ్ కేంద్రాలను ఎన్నికల నమోదు అధికారి తనిఖీ చేశారు. ఓటర్ల నుంచి అందిన దరఖాస్తులు, జారీ చేసిన నోటీసులు, వాటిపై చేపడుతున్న విచారణ తీరును పరిశీలించారు.
నోటీసుల విచారణ ప్రక్రియను వేగవంతం చేయాలి
⏩ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి సకాలంలో పరిష్కరించాలి: ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,
నోటీసులకు సంబంధించిన విచారణను క్షేత్రస్థాయిలో సమగ్రంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి, సంబంధిత ఓటర్ల వివరాలను నిర్ధారించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని ఆదేశించారు. ఓటర్ల జాబితాలో తప్పులకు తావులేకుండా బూత్ స్థాయి అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసిల్దార్ భవానీ ప్రసాద్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నగేష్, బూత్ స్థాయి అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.