భూ సమస్యల పరిష్కారానికి చేపట్టిన భూముల రీ సర్వేను మరింత వేగవంతంగా పూర్తిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సర్వేయర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పంథిని గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పురోగతిని కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా గ్రామ పరిధిలో 3541 ఎకరాల భూమి ఉండగా ఇప్పటివరకు 2144 ఎకరాల భూమి రీసర్వే పూర్తి అయినట్లు సర్వేయర్లు కలెక్టర్ కు వివరించారు. పట్టాదారు పాస్ బుక్ లో నమోదైన భూమి విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో రైతు అనుభవిస్తున్న భూమి విస్తీర్ణానికి ఏమైనా తేడాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.
అదేవిధంగా గ్రామానికి చెందిన రైతులు రాజిరెడ్డి, రామరాజు, సంపత్ రెడ్డి, సునీల్ రెడ్డి, మాధవి, సరోజన, నిర్మల,తదితర రైతులు భూముల రీ సర్వే జరుగుతున్న పంట పొలాల వద్ద ఉండగా కలెక్టర్ వారితో మాట్లాడారు. రీ సర్వే జరుగుతున్న తీరును గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. భూముల రీ సర్వే చేస్తుండడం బాగుందని, రాష్ట్ర ప్రభుత్వం మంచి కార్యక్రమాన్ని చేపట్టిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు.