అసెంబ్లీ అంటే దేవాలయమని అలాంటి దేవాలయం ముందు బిఆర్ఎస్ నాయకులు చేసిన ప్రవర్తన సిగ్గుచేటని, దళితులంటే బీఆర్ఎస్ పార్టీకి, కౌశిక్ రెడ్డికి ప్రేమ లేదని, ఎన్నికల ముందు వారి ఓట్ల కోసం కపట ప్రేమ చూపెడుతూ వారి సంక్షేమాన్ని అడ్డుకున్న వ్యక్తి కౌశిక్ రెడ్డి అని తీవ్ర స్థాయిలో హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ మండిపడ్డారు. మంగళవారం రోజున హుజురాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తాతా మధు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో తాతా మధు వ్యాఖ్యలకు నిరసన వ్యక్తం చేసి, ఆయన దిష్టి బొమ్మ దగ్ధంచేశారు. స్పీకర్ పై చేసిన వ్యాఖ్యల్లో బిఆర్ఎస్ నాయకులు సీనియర్లు అని చెప్పుకునే నాయకులు, మంత్రులుగా చేసిన వారు ఈ చర్యను ఏ విధంగా సమర్థించుకుంటారో వారి విజ్ఞతకు వదిలేస్తున్నామని అన్నారు. మహిళల పట్ల గౌరవం కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పోల్చుకునే స్థాయి కౌశిక్ రెడ్డిది కాదని, ఇప్పటికే ఆయన ప్రవర్తన చూసి హుజురాబాద్ ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.