Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
జిల్లా వార్తలు

వైభవోపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జన ఏర్పాట్లపై ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్, సిపి.

వైభవోపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్
Share Short Clip Download PDF

వైభవోపేతంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు, వినాయక నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు.

కలెక్టరేట్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జన ఏర్పాట్లపై పోలీస్ కమీషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్లు డాక్టర్ పి. శ్రీజ, పి. శ్రీనివాస రెడ్డి లతో కలిసి ఉత్సవ కమిటీ సభ్యులు, సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ..

ఖమ్మం జిల్లాలో గణేష్ ఉత్సవాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు అందిస్తున్న సహకారం అభినందనీయమని, గణేష్ ఉత్సవాల నిర్వహణకు అవసరమైన అనుమతులు నిబంధనల మేరకు అందిస్తామని తెలిపారు.

ప్రతి గణేష్ మండపానికి ముందస్తు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని, మండపాలు ఏర్పాటు చేసే సమయంలో ప్రజలు, వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా చూడాలని, పూర్తి రోడ్డు ఆక్రమించేలా మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు.

వినాయక విగ్రహాల తరలింపు సమయంలో విద్యుత్ షాక్ ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యుత్ మండపాల వద్ద షార్ట్ సర్క్యూట్‌కు అవకాశం లేకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేయరాదని అన్నారు. అనవసరంగా భారీ సౌండ్ బాక్సులు ఏర్పాటు చేయకుండా నిబంధనలు పాటించాలని సూచించారు.

గణేష్ నవరాత్రి ఉత్సవాలు, నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ స్వీయ నియంత్రణ పాటించాలని, ఉత్సవ కమిటీ సభ్యులు పోలీస్ అధికారులకు పూర్తిస్థాయిలో సహకరించాలని కలెక్టర్ కోరారు.

ప్రస్తుతం నీటి లభ్యత తక్కువగా ఉన్న నేపథ్యంలో గణేష్ నిమజ్జనానికి అవసరమైన నీటి సరఫరాపై ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అన్నారు. నీటిని ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎలా నిల్వ చేయాలి అనే అంశాలపై ముందుగానే చర్యలు ప్రారంభించాలని, నీటి నిల్వ సాధ్యం కాని ప్రాంతాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు.

నిమజ్జనం పాయింట్ల వద్ద అవసరమైన బ్యారికేడ్లు, క్రేన్లు, త్రాగునీరు, లైటింగ్ తదితర ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. నిమజ్జనం సందర్భంగా జిల్లాలో ఎక్కడా మద్యం విక్రయాలు జరగకుండా మద్యనిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు.

ప్రతి నిమజ్జన పాయింట్ వద్ద మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని, 108 వాహనం, పాము కాటు మందులు అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జన పాయింట్ల వద్ద మూడు షిఫ్టుల్లో పారిశుధ్య సిబ్బందిని నియమించి నిరంతరం పరిశుభ్రత పాటించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అవసరమైన చోట సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షించాలని అన్నారు.

నిమజ్జన పాయింట్ల వద్ద క్రేన్లకు అదనపు డ్రైవర్లు, క్రేన్ మరమ్మతులు చేసే మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని అన్నారు. నిమజ్జనం రోజున ఉదయం 6 గంటలకే క్రేన్లు సిద్ధంగా ఉండేలా చూడాలని సూచించారు. విగ్రహాల తరలింపుకు అడ్డుగా వచ్చే చెట్టు కొమ్మలను ముందుగానే తొలగించాలని అన్నారు.

నిమజ్జన పాయింట్ల వద్ద అవసరమైన మేరకు గజ ఈతగాళ్లను షిఫ్టుల వారీగా నియమించాలని, స్విమ్మర్లతో ముందుగానే చర్చించి వారికి విధుల షిఫ్ట్ వివరాలను తెలియజేయాలని అన్నారు. ప్రతి వినాయక మండపం వద్ద పోలీస్, ఫైర్, విద్యుత్, వైద్య తదితర అత్యవసర సేవల సంప్రదింపు వివరాలతో కూడిన చిన్న పోస్టర్ ఏర్పాటు చేయాలని సూచించారు.

గణేష్ విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన రూట్ మ్యాప్‌ను ముందుగానే సిద్ధం చేయాలని, నిమజ్జన రూట్లలో అవసరమైన రోడ్డు మరమ్మతు పనులను వెంటనే పూర్తి చేయాలని అన్నారు. జిల్లాలో ఎత్తైన విగ్రహాల తరలింపును ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.

నిమజ్జన పాయింట్లకు అప్రోచ్ రోడ్లు సక్రమంగా ఉండేలా చూడాలని, ప్రతి వినాయక మండపాన్ని రిజిస్టర్ చేసి, అక్కడ చేపడుతున్న ఏర్పాట్ల వివరాలను ముందుగానే సేకరించాలని అన్నారు. విగ్రహాల తరలింపుకు అడ్డుగా ఉన్న ఇంటర్నెట్, టీవీ కేబుళ్లను సరిచేయాలని సూచించారు.

ప్రతి గణేష్ మండపానికి ప్రభుత్వం నిబంధనల మేరకు విద్యుత్ కనెక్షన్ అందించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. లైన్‌మ్యాన్ ద్వారా విద్యుత్ కనెక్షన్ అందించేలా చూడాలని, ప్రజలు స్వయంగా విద్యుత్ కనెక్షన్లు ఏర్పాటు చేసుకుని ప్రమాదాలకు గురికావద్దని కలెక్టర్ కోరారు.

పోలీస్ కమీషనర్ సునీల్ దత్ మాట్లాడుతూ..

అన్ని శాఖలు, ఉత్సవ కమిటీలు సమన్వయంతో పనిచేసి గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని అన్నారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు జరిగేలా శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. నిమజ్జనం రోజున శోభాయాత్ర, చివరి పూజ కార్యక్రమాలను ఉత్సవ కమిటీ సభ్యులు ప్రణాళిక చేసుకోవాలని కోరారు. విగ్రహాల తరలింపునకు అవసరమైన వాహనాలను ముందుగానే బుక్ చేసుకోవాలని, రూట్ మ్యాప్‌ను ముందుగానే ఖరారు చేసుకోవాలని సూచించారు. మున్సిపల్ కార్పొరేషన్, ఉత్సవ కమిటీలు, పోలీస్ అధికారులు సమన్వయంతో నిమజ్జన రూట్ మ్యాప్‌ను ఖరారు చేయాలని అన్నారు. నిమజ్జనం పాయింట్ల వద్ద తగినంత త్రాగునీరు అందుబాటులో ఉంచాలని, అవసరమైన డ్రైవర్లు, మెకానిక్‌లను అందుబాటులో ఉంచాలని సూచించారు. నవరాత్రి ఉత్సవాల నిర్వహణకు పోలీస్ శాఖ నుంచి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.

ఖమ్మం మున్సిపల్ కమీషనర్ అభిషేక్ అగస్త్య మాట్లాడుతూ..

సెప్టెంబర్ 15లోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తామని తెలిపారు. నిమజ్జన రూట్లలో స్ట్రీట్ లైటింగ్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

ఉత్సవ కమిటీ సభ్యులు మాట్లాడుతూ

ఖమ్మం జిల్లాలో గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ప్రతి సంవత్సరం అధికారులు అందిస్తున్న సహకారం అభినందనీయమని అన్నారు. ఈసారి కూడా అధికారులు, పోలీస్, మున్సిపల్, విద్యుత్, ఫైర్, వైద్య శాఖలు సమన్వయంతో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.

ప్రస్తుతం మున్నేరు నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున వినాయక విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన నీటిని ముందుగానే అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిమజ్జన పాయింట్ల వద్ద కనీసం 7 ప్లాట్‌ ఫాం లు, 7 క్రేన్లు ఏర్పాటు చేయాలని కోరారు.

సెప్టెంబర్‌ 14న వినాయక చవితి, సెప్టెంబర్‌ 23న నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో ప్రతి గణేష్ మండపానికి అవసరమైన అనుమతులు త్వరగా మంజూరు చేయాలని, ఉత్సవాల సందర్భంగా ప్రభుత్వం ఉచిత విద్యుత్‌ సౌకర్యాన్ని ప్రతి మండపానికి అందేలా చూడాలని కోరారు. నిమజ్జనం రోజున నిర్వహించే శోభాయాత్ర రూట్‌లో రోడ్డు మరమ్మతులు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలని, విగ్రహాల తరలింపులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

గణేష్ మండపాల వద్ద అక్రమ విద్యుత్ కనెక్షన్లు లేకుండా, రోడ్లను పూర్తిగా ఆక్రమించకుండా ఉత్సవాలు నిర్వహించేలా కమిటీ సభ్యులు సహకరిస్తారని తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు, నిమజ్జనం జరిగేలా పోలీస్, జిల్లా యంత్రాంగానికి పూర్తి సహకారం అందిస్తామని ఉత్సవ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
అనంతరం గణేష్ మండపం నిర్వాహకులకు సూచనలు తెలుపుతూ ముద్రించిన కరపత్రాలను జిల్లా కలెక్టర్, సిపి ఆవిష్కరించారు.

ఈ సమావేశంలో కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్ యాదవ్, జిల్లా రెవెన్యూ అధికారి రామ్మూర్తి, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, జెడ్పీ సిఇఓ దీక్షా రైనా, విద్యుత్ ఎస్ఇ శ్రీనివాసా చారి, జిల్లా పంచాయతీ అధికారి వినోద్ కుమార్, జిల్లా వైద్య, ఆరోగ్య అధికారి డా. రామారావు, జిల్లా రవాణా అధికారి శ్రీనివాసరావు, జిల్లా ఎక్సైజ్ అధికారి జానయ్య, జిల్లా అగ్నిమాపక అధికారి అజయ్ కుమార్, స్తంభాద్రి ఉత్సవ సమితి ప్రెసిడెంట్ వినోద్ లహోటి, వర్కింగ్ ప్రెసిడెంట్ జి. విద్యాసాగర్, జనరల్ సెక్రటరీ కె. జయపాల్ రెడ్డి, కన్వీనర్ కన్నం ప్రసన్న కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ అల్లిక అంజయ్య, ట్రెజరర్ ఎం. శ్రీహరి, సెక్రటరీ డోవలె సాయికిరణ్, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.