మహాత్మా జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్లో సింగరేణి నూతన ప్రాజెక్టులు, భవిష్యత్ విస్తరణ ప్రణాళికలపై సంస్థ ఉన్నతాధికారులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. బొగ్గు తవ్వకాలకే పరిమితం కాకుండా కీలక, వ్యూహాత్మక ఖనిజాల అన్వేషణ, మైనింగ్ రంగాల్లోకి సింగరేణి విస్తరించాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. కర్ణాటకలోని దేవదుర్గ బంగారం, రాగి ఖనిజ బ్లాక్లో అన్వేషణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.
కాపర్, గ్రాఫైట్, లిథియం, కోబాల్ట్, వనాడియం, టైటానియం వంటి భవిష్యత్ కీలక ఖనిజాల అవకాశాలను అందిపుచ్చుకోవడంతో పాటు దేశీయ, అంతర్జాతీయ ఖనిజ వేలాల్లో సింగరేణి చురుకుగా పాల్గొనాలని సూచించారు. నైనీ స్ఫూర్తితో దేవదుర్గ ప్రాజెక్టును విజయవంతం చేసి, కీలక ఖనిజాల రంగంలో సింగరేణి విస్తరణకు బలమైన పునాది వేయాలని ఆయన పేర్కొన్నారు. సింగరేణిని మరింత లాభదాయకంగా తీర్చిదిద్ది, భవిష్యత్ తరాలకు బలమైన ప్రభుత్వ రంగ సంస్థగా అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.