విద్యార్థులకు అందించే యూనిఫాం మరింత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. డిజైన్లలో వైవిధ్యానికి ప్రయత్నించాలని చెప్పారు. విద్యార్థులకు అందించే యూనిఫాం, ఇతర సామగ్రి పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్ పిల్లలకు ఒక జత యూనిఫాం పంపిణీ పూర్తయిందని, రెండో జత యూనిఫాంను నెలాఖరులోగా అందజేస్తామని సమావేశంలో అధికారులు తెలియజేశారు. కేజీబీవీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందజేసినట్లు తెలిపారు. విద్యార్థులందరికీ నోటు పుస్తకాలు పంపిణీ పూర్తయిందన్నారు. ప్రభుత్వ వసతిగృహాలు, రెసిడెన్షియల్స్ స్కూల్స్, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లలోని విద్యార్థులందరికీ ప్లేట్లు, గ్లాసులు, కటోరాలు, స్పూన్లు, కప్పులు, కార్పెట్లు, బెడ్షీట్లు, టవళ్లు పంపిణీ పూర్తయిందని అధికారులు వివరించారు. వచ్చే ఏడాది పాఠశాలలు తెరిచిన రోజే యూనిఫాం, ఇతర సామగ్రి విద్యార్థులకు అందేలా ఇప్పటి నుంచే కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న విద్యార్థులకు అదనంగా 10 శాతం విద్యార్థులు పాఠశాలల్లో చేరే అవకాశం ఉన్నందున, అందుకు తగినట్లు ప్రణాళిక రూపొందించుకోవాలని చెప్పారు. ఈ ఏడాది అందించిన యూనిఫాం, ఇతర సామగ్రి నాణ్యతపై తల్లిదండ్రుల నుంచి సంతృప్తి వ్యక్తమైందని అన్నారు. ఈ సమీక్షలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి తో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.