Friday, 18 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
క్రైమ్ న్యూస్

నూనె మిల్లును సీజ్ చేసిన పంచాయతీ కార్యదర్శి

నూనె మిల్లును సీజ్ చేసిన పంచాయతీ కార్యదర్శి
Share Short Clip Download PDF

గ్రామ పంచాయతీ ముందస్తు అనుమతులు లేకుండా, కనీస భద్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రమాదకర పరిస్థితుల్లో నడుస్తున్న "నగేష్ నూనె మిల్లు"పై అధికారులు కొరడా ఝళిపించారు. స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి సమక్షంలో పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్ శుక్రవారం ఈ మిల్లును పూర్తిగా సీజ్ చేశారు.

గ్రామ పంచాయతీ కార్యదర్శి వెల్లడించిన వివరాల ప్రకారం..

నల్లబెల్లి మండల కేంద్రంలో జక్కుల నగేష్ నిర్వహిస్తున్న నూనె మిల్లుకు సంబంధించి ఎలాంటి అధికారిక ట్రేడ్ లైసెన్స్ (Trade License) తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా, నిర్లక్ష్యంగా సాగుతున్న ఈ కేంద్రంలో ఇటీవల రంగాపురం గ్రామానికి చెందిన కందకట్ల కవిత అనే మహిళ పల్లీలు పట్టించేందుకు రాగా, యంత్రాలకు సేఫ్టీ గార్డులు (రక్షణ కవచాలు) లేకపోవడంతో ఆమె కుడి చేయి చక్రంలో ఇరుక్కుని తెగిపడి తీవ్రంగా గాయపడింది. ఈ దుర్ఘటనపై తక్షణమే స్పందించిన పంచాయతీ యంత్రాంగం, బాధ్యుడైన యజమానికి 24 గంటల గడువుతో షోకాజ్ నోటీసు జారీ చేసింది. అయితే, నిర్వాహకుడి నుంచి ఎలాంటి సమగ్ర వివరణ రాకపోవడంతో, ప్రజల ప్రాణరక్షణ దృష్ట్యా తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం-2018 నిబంధనల ప్రకారం మిల్లును తక్షణమే సీజ్ చేశారు.
ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి నూతనకంటి ప్రశాంత్ మాట్లాడుతూ, గ్రామ పరిధిలో సరైన అనుమతులు లేకుండా వ్యాపారాలు కొనసాగించినా, ప్రజా భద్రతను విస్మరించి ప్రమాదకరంగా మిల్లులు నడిపినా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నాగెల్లి జ్యోతి ,ప్రజాప్రతినిధులు , గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

నూనె మిల్లును సీజ్ చేసిన పంచాయతీ కార్యదర్శి