హైదరాబాద్ లోని తెలంగాణ శాసనసభ స్పీకర్ ఛాంబర్ అసెంబ్లీ భవనంలో సోమవారం షెడ్యూల్ కులాల సంక్షేమ కమిటీ తొలి సమావేశం జరిగింది. శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, శాసన మండలి స్పీకర్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ సమావేశానికి కమిటీ చైర్మన్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అధ్యక్షత వహించారు. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు తర్వాత సంక్షేమ పథకాల ప్రభావంపై సమీక్ష చేపట్టాలని సభ్యులు సూచించారు. ఎస్సీ వర్గాలకు ప్రభుత్వం అమలు చేస్తున్న విద్య, ఉపాధి, గృహ, భూ పంపిణీ, ఆర్థిక అభివృద్ధి పథకాల అమలుపై చర్చ జరిగింది. ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల వినియోగం, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పన, గురుకులాలు, హాస్టళ్ల నిర్వహణపై ప్రత్యేక అధ్యయనం చేయాలని సమావేశం అభిప్రాయపడింది. ఎస్సీలకు సంబంధించిన భూ సమస్యలు, అట్రాసిటీ కేసులు, విద్యా అవకాశాలు, ఉపాధి కల్పన వంటి అంశాలపై జిల్లా స్థాయి సమీక్షలు నిర్వహించాలని సమావేశం ప్రతిపాదించింది. ప్రభుత్వ శాఖల అధికారులు, సంక్షేమ శాఖల నుంచి సమగ్ర వివరాలు తీసుకుని, అవసరమైతే జిల్లాల పర్యటనలు చేపట్టాలని సభ్యులు కోరారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, మందుల సామెల్, ఎడ్మ బొజ్జు, కేఆర్ నాగరాజు, కె.మాణిక్ రావు, విజయుడు, కౌన్సిల్ సభ్యులు పింగిళి శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్యతోపాటు ఆయా సభల అధికారులు పాల్గొన్నారు.