Thursday, 17 September 2026 Rights Media Society · Regd. No. 269/2026
తెలంగాణ

పర్యవేక్షణతో అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి...

రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర రావు.

పర్యవేక్షణతో అభివృద్ధి పనులు నాణ్యతతో పూర్తి చేయాలి...
Share Short Clip Download PDF

నగరంలో చేపట్టిన అభివృద్ధి పనులను పర్యవేక్షణతో నాణ్యతతో పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని 42వ డివిజన్‌లో రూ. 95.50 లక్షల సుడా నిధులతో చేపట్టనున్న రోడ్లు, సీసీ డ్రైన్ల నిర్మాణ పనులకు మంత్రి వర్యులు శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ

ప్రజలకు ఉపయోగ పడే ప్రతి అభివృద్ధి పనిని నాణ్యతతో చేపట్టి, పదికాలాల పాటు మన్నికగా ఉండే విధంగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. పనుల అమలులో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని, ప్రభుత్వ నిధులను పారదర్శకంగా వినియోగించాలని స్పష్టం చేశారు. అభివృద్ధి పనులను ప్రజాప్రతినిధులతో పాటు స్థానిక ప్రజలు కూడా నిరంతరం పర్యవేక్షించాలని, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే పనులు మరింత నాణ్యతగా పూర్తవుతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన మౌళిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తోందని అన్నారు.

నగరంలో విశాలమైన రహదారులు, మెరుగైన మౌళిక సదుపాయాలు కల్పించడం ద్వారా అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని మంత్రి పేర్కొన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్న మంత్రి, పరిశుభ్రత వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా కుటుంబాలపై వైద్య ఖర్చుల భారం తగ్గుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మహ్మద్ ఖాదర్ బాబా, ఖమ్మం ఆర్డీవో ఎన్. శ్రీనివాస్, మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.