కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించి ఈ వినాయక చవితికి మట్టి గణేశ్ విగ్రహాలను ప్రతిష్ఠించాలని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్పర్సన్ గుండు సుధారాణి పిలుపునిచ్చారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో మట్టి గణేశ్ విగ్రహాలను గురువారం కుడా కార్యాలయంలో హన్మకొండ జిల్లా కలెక్టర్, కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్పర్సన్ చాహత్ బాజ్పాయ్ తో కలిసి అధికారులు, సిబ్బందికి కుడా చైర్పర్సన్ గుండు సుధారాణి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ...
వినాయక చవితి మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే పవిత్రమైన పండుగ అని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ పండుగను జరుపుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. మట్టి గణపతులను ప్రతిష్ఠించడం ద్వారా మన సంప్రదాయాన్ని కాపాడటంతో పాటు చెరువులు, కుంటలు, జలవనరులను కాలుష్యం నుంచి రక్షించవచ్చన్నారు
రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్తో తయారు చేసిన విగ్రహాల వల్ల నీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉందని, జలచరాలు, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. అందువల్ల సహజసిద్ధమైన మట్టితో తయారు చేసిన గణేశ్ విగ్రహాలను వినియోగించడం ద్వారా పర్యావరణానికి మేలు చేకూరుతుందన్నారు.
భక్తితో గణపతిని ఆరాధిద్దామని. బాధ్యతతో ప్రకృతిని కాపాడుదామని. మన వినాయకుడు మట్టితో వస్తే.. మన భవిష్యత్ తరాలకు స్వచ్ఛమైన ప్రకృతి మిగులుతుందని సుధారాణి పేర్కొన్నారు.
ప్రతి కుటుంబం, ప్రతి కాలనీ, ప్రతి గణేష్ మండపం మట్టి గణపతులనే ప్రోత్సహించి పర్యావరణహితమైన వినాయక చవితి నిర్వహణకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అధికారులు, సిబ్బంది మాత్రమే కాకుండా ప్రజలందరూ ఈ సందేశాన్ని విస్తృతంగా ప్రచారం చేసి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ...
రకరకాల రంగులతో, రసాయనాలతో తయారు చేసే వినాయకులకు పూజ చేసి చెరువులను అలాగే పర్యావరణ కాలుష్యం చేయకుండా మట్టి వినాయకులనే అందులో నీటి ఎద్దడి వల్ల తక్కువ ఎత్తు ఉన్న వినాయకులనే ప్రతిష్టించాలన్నారు
ఒకప్పుడు వినాయకుణ్ణి తయారు చేయడానికి..చెరువు మట్టి వాడి మళ్ళీ.. అందులోనే నిమజ్జనం చేసేవారాని కలెక్టర్ తెలిపారు. మళ్ళీ అలాంటి రోజులు రావాలని పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని తెలుసుకోవాలన్నారు
ప్రకృతి ని మనం కాపాడుకోవలిసిన అవసరం ఉందన్నారు. వివిధ కాలనీలో ఏర్పాటు చేసే మండపాల వద్ద ఎంత తక్కువ వీలు అయితే అంతా తక్కువ ఎత్తు విగ్రహాలను పెట్టి పూజించుకోవాలన్నారు. పోటీలకు పోకుండా ఆధ్యాత్మిక మార్గంలో.. ఆలోచించాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎన్పీడీసీఎల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ సామ్యా నాయక్, కుడా సీపీఓ అజిత్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భీంరావు,పీసీబీ ఈఈ, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.