రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటలని, నాటిన ప్రతి మొక్కను రక్షించాలాని, ఇందుకు
ప్రతి ఒక్కరూ భాగస్వాములు అవ్వాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా మొక్కలు నాటి పెంచడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఆమె అన్నారు.
వరంగల్ నగరంలోని రంగశాయిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన నిర్వహించిన వన మహోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యావరణ శాఖ మంత్రి వర్యులు కొండా సురేఖ ముఖ్య అతిథిగా పాల్గొని కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, జిల్లా ఫారెస్ట్ అధికారి నిఖిత,గ్రంథాలయ చైర్మన్ మీసాల ప్రకాశ్ పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన నూతన ఓపెన్ జిమ్ను ప్రారంభించి, వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఎల్నినో ప్రభావం కారణంగా వన మహోత్సవ కార్యక్రమం కొంత ఆలస్యమైందన్నారు. ఒక్క రోజులోనే 10 శాతం మొక్కలు నాటేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటిలో, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో, ప్రభుత్వ కార్యాలయాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలని సూచించారు.
సకాలంలో వర్షాలు కురవకపోవడానికి సరైన వృక్ష సంపద లేకపోవడం కూడా ఒక ప్రధాన కారణమని మంత్రి పేర్కొన్నారు. వృక్షాలు మానవ మనుగడకు ఎంతో దోహదపడతాయని, పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు చెట్లు అత్యంత అవసరమన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పెంచి సంరక్షించాలనే కృతనిశ్చయంతో ముందుకు సాగాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలు నాటే సంప్రదాయాన్ని అలవాటు చేసుకోవాలని మంత్రి కోరారు. మొక్కలను నాటడం తో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. చెట్లను నరకకుండా కాపాడాలని పిలుపునిచ్చారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ..
వరంగల్ జిల్లాలో 25 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నామని, ఇప్పటివరకు సుమారు 13 లక్షల మొక్కలు నాటినట్లు తెలిపారు. మిగిలిన లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అన్ని శాఖల సమన్వయంతో చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీసీఎఫ్ భీమా నాయక్ మాట్లాడుతూ..
వృక్ష సంపద సమృద్ధిగా ఉంటే వాతావరణ మార్పుల ప్రభావం తగ్గి, సకాలంలో వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండే అవకాశం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని వృక్షాలుగా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకోవాలని సూచించారు.
వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా వివిధ పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, ఆర్డీవో సుమ, జడ్పీ సీఈఓ రామ్ రెడ్డి, తహసీల్దార్ ఇక్బాల్, వివిధ శాఖల అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు.