హైదరాబాద్–విజయవాడ హైవేపై కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో ఘోర ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏలూరుకు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఐరన్ రాడ్ల లోడుతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆరుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 20 మందికి తీవ్రంగా గాయపడ్డారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. హైదరాబాద్- విజయవాడ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముందు వెళ్తున్న కంటైనర్ డీసీఎంను వాహనాన్ని వెనుక నుంచి వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సులోని ఆరుగురు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలో ఇవాళ తెల్లవారుజామున ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
కంటైనర్ను ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు.. ఆరుగురు స్పాట్ డెడ్
వివరాల్లోకి వెళితే..
హైదరాబాద్ నుంచి ఏలూరుకు అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బయల్దేరింది. బస్సుకు ఇద్దరు డ్రైవర్లు ఉండగా.. సూర్యాపేటకు చేరుకోగా డ్రైవర్ ఛేంజ్ అయ్యారు. ఆ తర్వాత బస్సు బయల్దేరగా.. కోదాడ మండలం దుర్గాపురం స్టేజీ సమీపంలోకి చేరుకోగానే ముందు ఐరన్ రాడ్లతో వెళ్తున్న డీసీఎం వాహనాన్ని ఢీకొట్టింది. బస్సు రైట్ యాక్సిడెంట్ కాకా.. ఐరన్ రాడ్లు బస్సులోపలికి దూసుకెళ్లాయి. ప్రమాద తీవ్రతకు బస్సు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు ప్రయాణికులు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో ఇద్దరు డ్రైవర్లతో కలిపి మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నారు.విషయం తెలుసుకున్న పోలీసులు, హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకొన్నారు. సహాయక చర్యలు చేట్టి తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ ఆసుపత్రితో పాటు విషమంగా ఉన్నవారిని మెరుగైన చికిత్స కోసం సమీపంలోని ఇతర ప్రైవేటు ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని డాక్టర్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడగా.. పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేశారు. అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా, ప్రమాదానికి గల కారణాలు, మృతుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
రోడ్డు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
సూర్యాపేట జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కోదాడ మండలం ద్వారకుంట దగ్గర కంటైనర్ను ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. మృతుల కుటుంబాలకు సీఎం ప్రగాఢ సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను ఆదేశించారు.
కోదాడ వద్ద ప్రమాద ఘటనపై పవన్ కళ్యాణ్ విచారం
హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ వద్ద చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందడం పట్ల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గల కారణాలను అధికారుల ద్వారా తెలుసుకున్నారు. ఈ ప్రమాదంలో మరో 11 మంది తీవ్రంగా గాయపడగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వివరించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, తెలంగాణ రాష్ట్ర అధికారులతో సమన్వయం చేసుకోవాలని సంబంధిత అధికారులకు పవన్ కళ్యాణ్ సూచించారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు పవన్ కళ్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
కోదాడ రోడ్డు ప్రమాదంపై జిల్లా ఎస్పీ దిగ్భ్రాంతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివ కిషోర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంటనే సూర్యాపేట జిల్లా ఎస్పీ/పోలీస్ అధికారులతో ఫోన్ లో మాట్లాడారు. బస్సులో ఉన్న ఏలూరు జిల్లాకు చెందిన ప్రయాణికులు, మృతులు లేదా క్షతగాత్రుల వివరాలను ఆరా తీస్తున్నారు. ఏలూరు జిల్లా వాసులు ఎవరైనా ఈ ప్రమాద బాధితుల జాబితాలో ఉన్నారా అనే కోణంలో అధికారిక వివరాలను సేకరిస్తున్నారు. బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు మరియు స్థానిక అధికారులతో సమన్వయం చేసుకునేందుకు ఏలూరు జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది అని జిల్లా ఎస్పీవెల్లడించారు.